బాల ద్విపద భాగవతం : ప్రథమాశ్వాసము - భాగం 1
ద్విపద బాల భాగవతము
(దోనేరి కోనేరునాథకవి విరచితము)
ప్రథమాశ్వాసము
ప్రథమాశ్వాసము
అవతారిక
ఇష్టదేవతాస్తుతి
1
శ్రీవేంకటేశు నూర్జిత[1] దయావేశు
సేవక శ్రీదు[2] నంచిత తీర్థపాదు
నిరుపమోల్లస సువర్ణిత మందహాసుఁ
బరిపూర్ణ సంతోషుభాసుర వేషు
కౌస్తుభోదారు సాగరసుతాధారుఁ
నస్తోక[3] రుచిజాలుఁ నంబుద నీలు
అనఘాత్మగమ్యుఁ బీతాంబరరమ్యు
వినుత చిత్ర చరిత్రు విమలాబ్జ నేత్రు
శ్రవణ మంగళనాము జగదేక కాము
రవిచంద్ర నయను నిర్మల భోగిశయను
మకరకుండలభూషు మంజీరవేషుఁ
బ్రకట కాంచీదాముఁ బరిభూతకాము
కరిరాజ వరదాయిఁ గరి[4]దర్ప దమనుఁ
నరిసాధకాసన్నుఁ నరి సాధనాంకు
నర్జున స్థితి హరుఁ నర్జున[5] మిత్రు
వర్జిత లోభుఁ నావర్జిత కల్పు
దేవసంరక్షకు దేవాధిదేవు
భావనాతీతుఁ బ్రభావ విఖ్యాతు
నందవత్సలు మహానంద స్వరూపు
నందక ధరు గోపనంద కిశోరు
[1] ఊర్జిత- దృఢమైన
[2] శ్రీదు- సంపదలను ప్రసాదించువాడు
[3] అస్తోకము- అనల్పము
[4] కరి- 1వది గజేంద్రుడు, 2వది కంసుని కువలయాపీడం
[5] అర్జున- 1వది మద్దిచెట్లు, 2వ వాడు పాండవ మధ్యముడు
11
సిందూర ప్రకటాంధ్ర సింధు సౌవీర
సింధురాచలవీరు సూత్రప్రకారుఁ
గారుణ్య కలిత పుష్కర జాలధీరు
ధీరుచి కల్పితస్థితి మహాదేవు
దేవకీ వసుదేవు దృష్ట[6] స్వభావు
భావజకేళి సంభావిత నీళు[7]
రామయ తిమ్మ భూరమణు సూనునకు
నామను బుక్క భూపామరేంద్రునకు
ఘనునకుఁ జాళుక్యకంఠీరవునకుఁ
జినతిమ్మ నృపతికి సిరులిచ్చు వేల్పు
వెలయు జంగుళిదైవవేశ్యా భుజంగుఁ
నలఘు నకల్పు నారాయణు గొలుతు
ఆనలినాక్షుఁ దా నాశ్రయించియునుఁ
ధానుఁనవ్విభుని చెందగ సేవఁగొనియు
శ్రీనామ మలరెడు చిగురాకు బోటి
మానినీ పతి భుజామధ్యైక వసతి
కలిమి చూపుల తల్లి కలశాబ్ధి పట్టు
జలజవాసిని దివ్యజలజాంక హస్త
అనిశంబు సిరులిచ్చి హర్షం బొసంగు
చినతిమ్మ భూపాలశేఖర మణికి
[6] దృష్ట- చూడబడినది, ప్రపంచము
[7] ఇళ- ఈళుడు ఇళ గలవాడు, 1. విష్ణుమూర్తి భార్యలలో ఒకరు, 2. శ్రీకృష్ణుని భార్య, రాధాదేవి పెంచిన కన్య, యశోదమ్మ సోదరుని కుమార్తె
21
వేత్రంబు ధరియించి విశ్వంబునేలు
సూత్రవతీ[8] హృదీశుండైన ఘనుఁడు
సర్వశేషికి భక్తిసర్వకైంకర్య
నిర్వాహియై యింపునిలుపు శేషుండు
హరిపదాంభోజ విన్యాస పవిత్ర
కరశోభితుండైన ఖగవల్లభుండు
ముక్తులు హరిపదాంభోజాత భజన
యుక్తులు సనకాది యోగీంద్రవరులు
బలి, విభీషణ, శుక, పవనజ[9], వ్యాస,
జలజ సూతిజ[10], పరాశర, వసిష్ఠులును,
హరిసూను[11], వసువులునాదిగాఁ గలుగు
పరమ భాగవతులుఁ బ్రబల మోదమున
ఘనుఁడైన తిమ్మ భూకాంతు కుమారు
చినతిమ్మ నృపుని వాంఛిత మిత్తురెపుడు
అనిసపరిచ్ఛదం బగునట్లుఁగాఁగఁ
ననువొందు భక్తిచే హరిఁ బ్రస్తుతించి
శారద స్తుతి
సారదయాలోల జనకామితార్థ
పారద వల్లకీవాదన నిపుణ
శారద నీరద సమదేహ కాంతి
శారద చిత్తాంబుజంబున నిలిపి
[8] సూత్రవతి- విష్వక్సేనుని భార్య సూత్రవతి, మరొకభార్య జయ
[9] పవనజుడు- వాయుపుత్రుడు హనుమ
[10] జలజసూతిజుడు- జలజసూతు అంటే పద్మసంభవుడైన బ్రహ్మ, ఆ బ్రహ్మపుత్రుడు నారదుడు
[11] హరిసూనుడు- ఇంద్రుని కొడుకు, అర్జునుడు
సంస్కృత సాహిత్య పూర్వకవిస్తుతి
31
వ్యాస, వాల్మీకి సంయముల నపార
భాసుర కవితా ప్రభావుల గొలుతు
నాళీకభవ[12] సమానత బెంపుఁగన్న
కాళిదాసాదిక కవులఁ గీర్తింతు
ఆంధ్ర సాహిత్య పూర్వకవిస్తుతి
నన్నపార్యుఁడు, భీమనయుఁ, దిక్క శౌరి,
సన్నుతక్రముఁడైన శంభు దాసుండు
మొదలైన వారల మున్నాంధ్ర కవిత
యొదవించినది యార్యులఁ బ్రస్తుతింతు
కుకవినింద సుకవి స్తుతి
కడుఁబ్రయాసమున దుష్కవితలుఁ గూర్చి
యెడపక సభఁ నార్యులెల్లఁ జా యనఁగ
చదివి తారొక వంక జపచపఁ నగుచు
మెదలెడు సుకవుల మేలు కావ్యములఁ
నరసి రాజులు మెచ్చునట్లుగాఁ నెపుడు
దెరువులుఁ దెల్పెడు ధీరచిత్తులకు
కుకవుల కింపులుఁ గూడ దీర్ఘాయుఁ
వకుటిలం బగుఁ గాత యనుచు దీవింతు
ననితలఁ పొనఁగూడునట్లుగా సుకవి
జనమతాచారంబుఁ జక్క నొనర్చి
కవి కావ్యరచనా కౌతుకము - కృతిపతి అనురోధము
యేనొక్క శుభవేళ నిందిరా విభుని
భూనుత కథలచేఁ బొగడంగఁదగిన
[12] నాళీకభవుడు- బ్రహ్మదేవుడు
41
వొకప్రబంధము పల్కు నుద్యోగ పరత
ప్రకటించి ముదము చొప్పడ నుండునంత
యేరాజు ఘనకీర్తు లెల్ల దిక్కులకు
హారాచలస్ఫూర్తు లనువొంద నిలుపు
యేమహీశు ప్రతాప మేపుమై నహిత
భూమిపాలకుల పెంపులు మాయఁ జేయు
యేనరేంద్రుని చాగ[13] నెలమి దైవాఱ[14]
ధేనురత్నంబుల తెలివి హరించు
యేపార్థివుని భుజం బిల ధరియించి
ప్రాపగు శేషాద్రి భద్రేభములకు
యేనృపోత్తము సత్యహిత వచో మహిమ
పూనిగెల్చుఁ ద్రిశంకు పుత్రాది ఘనుల
నట్టిమహోన్నతుం డతుల ప్రతాప
ఘట్టిత సామంతగణ హృదయుండు
బిరుదుమన్నెరగండ బిరుద లాంఛనుఁడు
పరమహీశాంబుధి బాడబానలము
నిరుపమ గాంభీర్యనిధి మండలీక
ధరణీ వరాహుండు ధైర్య హేమాద్రి
సురుచి రాపస్తంబసూత్రుఁ డాత్రేయ
వరగోత్రుఁ డతిసాంద్ర వైభవేంద్రుండు
[13] చాగము (వికృతి) త్యాగము (ప్రకృతి)
[14] దైవాఱు- అతిశయించు
51
సోమవంశాంబుధి సోముండు కీర్తి
ధాముండు బుక్కభూధవ ప్రపౌత్రుండు
రామభూపతి తిమ్మరాజ పుత్రుండు
ధీమాననీయుండు తిరుమల నృపతి
మృగమద కుంకుమ మిశ్రలేపనము
ప్రగుణ ముక్తాఫల రంగవల్లికలు
ప్రసవోపహారాది పరిమళ క్రమము
లసమ నిర్మల వితానాది[15] సంగతులుఁ
గలుగు శోభన సభాగారంబు నందు
వలనైన జయ జయ ధ్వనులు పెల్లొదవ
దక్షిణాశా జయస్తంభ యోజకులు
శిక్షిత దుర్మద క్షితిపాలగణులు
వినయ లక్ష్మీ యుతుల్ విఠ్ఠలోర్వీశ
చినతిమ్మనృపతు లంచితకీర్తి ధనులు
పాపతిమ్మక్షమాపతియును నాది
యైపొల్చు ననుజన్ము లతి భక్తిఁ గొలువ
వివిధ శాస్త్ర విలాస విద్వజ్జనంబు
నవరసాలంకార నైపుణ[16] కవులు
సంగీత వేదులు సచిన పుంగవులు
మంగళ పాఠకుల్ మల్లులు, భటులు
[15] వితామన- చాందినీ
[16] నైపుణి- నైపుణ్యము, నేర్పరితనము
61
మొదలైన నియ్యోగములు నిండి కొలువ
ముదము గావించు పెంపునఁ గొలువుండి
సాహిత్య గోష్ఠి ప్రసంగవశమున
నూహించి కృతి మీద నుల్లంబు వొడమి
అమరంగఁ నాశ్వలాయనశాఖ యందు
కొమరొందు శ్రీవత్సగోత్రాంబురాశిఁ
గలుగు దోనూరి నాగయ మంత్రి సుతుని
విలసిత సాహిత్య విశ్రాంతిమంతు
వినుతాష్ట భాషాకవిత్వ ప్రచండు
ననఘఁ గోనేరునాథాఖ్యుని నన్నుఁ
బిలిపించి సముచిత ప్రియ పూర్వకముగఁ
బలికె గంభీర విభ్రమ విశేషమున
“నర నుతాహోబలనరసింహ భజన
గురుయోగ దోనూరి కోనేరునాథ!
మాకుఁ నాశ్రితుడవు మహనీయ లీల
లోకులు మెచ్చఁ బల్కుఁదు[17] మేలు కవిత
ధరఁగల్గు సప్తసంతానంబు లందు
నరుదైన యది నిల్చుఁ నదియునుఁ గృతియె
జనపతీ మణికి మజ్జనకుఁడౌ రామ
జననాథు తిమ్మ భూజానికి మున్ను
[17] పల్కుదు పల్కుదువు
71
వచియించి తౌనన పద్య కావ్యముగఁ
బ్రచురంబుగా బాలభాగవతంబు
వాసికి నెక్కి యివ్వసుధా తలమున
భాసిల్లు నా బాలభాగవతంబె
అరుదుగా నడచిన యన్ని మార్గములఁ
దిరముగా మా చినతిమ్మయ్య పేర
ద్విపద కావ్యంబుగా వెలయంగఁ జేయు
మిపుడు మాకెంతయు హితమిది” యనుచు
వివిధ విచిత్ర నవీనాంబరములు
నవరత్నమయ భూషణము లెన్నఁ దగిన
యగ్రహారంబులు నగ్ర హారములుఁ
నగ్రియ[18] పల్యంకికాది[19] వస్తువులు
తగనిచ్చి కర్పూరతాంబూల మొసఁగి
ప్రగుణిత బహుమాన పరితుష్టుఁ జేసె
కవి మనోగత కాంక్ష
అనుమతించితిఁ నప్పు డవ్వాక్య మేనుఁ
ననురూప శుభ నిమిత్తాలోకనమున
కమలాక్షు కథలచేఁ గడు బవిత్రంబుఁ
గమనీయమునునైన కావ్యంబు పలుకుఁ
దలఁపుఁ జొచ్చిన తిమ్మధరణీశ్వరుండుఁ
గలిగె నందులకుఁ జక్కని నాయకుండు
[18] అగ్రియ- శ్రేష్టమైన
[19] పల్యంకిక- పల్లకీ
81
హరికి లచ్చి నొసంగి యంభోధి వోలె
ధరమించు నా కవితాకన్య నిపుడు
చినతిమ్మ నృపతికిఁ జెలువుగా నొసఁగి
ఘనతర సంతోష కలితుండ నగుదు
కడుపునఁ బుట్టిన కన్యకుఁ బెండ్లి
కొడుకనుకూలుండుఁ గూడుటం బోలె
కవితకు నరవరాగ్రణి నాథుఁడైన
కవుల మోదమునకుం గడపలఁ గలదె?
వనజారిశోభనవంశ మౌక్తికము
చినతిమ్మ నరభర్త చేపట్టు కతన
ధరనీధరుని ప్రసాదపు జాజిదండ
సరణిఁ నాకృతి సర్వజనసేవనొందు
కృతిముఖంబునఁ కలంకృతిగాఁగ నింకఁ
గృతినాథు వంశంబుఁ గీర్తింతు నిపుడు
కృతినాథుని వంశక్రమము
హరినాభి కమలంబునందు జనించె
బరమేష్ఠి శారదాపతి చతుర్ముఖుఁడు
అతనికిఁ నాత్మ జుండైపెంపు గాంచెఁ
నతుల తపో ధనుండగు నత్రి మౌని
యభిరూపమైన యయ్యత్రి నేత్రమున
శుభకళాన్వితుఁడైన సోముండు వొడమె
91
అతనికి బుధుఁడను నాత్మజుం డొదెవెఁ
నతఁడు పురూరవుండను పుత్రుఁ గాంచె
ఆయువవ్వి భునకుఁ నతనికి నహుషుఁ
డా యుత్తమునకు యయాతి జనించె
అతని పుత్రుఁడు పూరుఁ డతని వంశమునఁ
బ్రతిలేక కడుఁ బేరుపడియెఁ బరిక్షి[20]
అనవద్య గుణుడైన యతని వంశమున
ఘనుఁ డారెవీటి బుక్కనృపాలుఁ డెసగె
నరనాథమణి సాళ్వనరసింగరాయ
వరసఖుండై బుక్కవసుధీశుఁ డలరె
ఆమహీపతికి బల్లాంబిక యందు
రామనృపాలుండు రాజేంద్రుఁ డొదవె
యెందుఁనెన్నఁగఁ జాలు నిద్ధ శౌర్యమునఁ
గందనవోలి[21] దుర్గంబులో నుండి
బుక్కయు రామభూభుజుఁ డెల్ల నృపులుఁ
నెక్కువ యిది యని యెన్నంగఁ జాలి
వీరులు డెబ్బదివేవు రాశ్వికులు
చేరికొల్వంగ వచ్చిన సవా నెదిరి
కలఁనంది[22] పంచబంగాళంబు[23] సేసె
గెలిచెఁ నచ్చరితంబుఁ గీర్తింపఁ దరమె
వినుతింపఁదగుఁ నాదువేని[24] దుర్గమునఁ
ననతుఁడై యుండు కాచాధీశుఁ[25] గెలిచి
[20] ‘పరిక్షి‘- ‘పరీక్షిత్తు’
[21] కందనవోలు- కందనవూరు, ప్రస్తుత కర్నూలు,
[22] కలను- యుద్ధం, కలహము
[23] పంచ బంగాళము చేయు- చెల్లాచెదరు చేయు, పటాపంచలు చేయు
[24] ఆదువేని, తర్వాత ఆదవాని, ప్రస్తుతం ఆదోని అనే పేరు గల యీ పట్టణం కర్నూలులోని ఆదోని తాలూకాకు ముఖ్యపట్టణం.
[25] కాచాధీశుడు- మొదటి రామరాజు ఆనవేని (ప్రస్తుత ఆదోని) దుర్గాధీశుడైన కాచరాజు