బాల ద్విపద భాగవతం : భాగం-6-501-600
501
గర్భగృహంబులోఁ గణకఁ గేశవుఁడు
నిర్భర కరుణ వర్ణితముగాఁ బలికె;
తడయక మెడ కట్లు దప్పించి నంత
విడివడి కోడెలు వేగంబ కెరలి
తమురాజుఁ గట్టిన తరళ చిత్తులను
సమయించి చనియె నసాధ్యంబు లగుచు
జననాథ! యీ రీతిసత్కథా క్రమము
వినుతింపఁబడు జగద్విదితం బనంగ;
ఆమహీపతి చందలాంబిక యందు
సోమభూపాలు నచ్యుతభక్తుఁ గాంచె;
అమ్మేటి నృపుఁడును లక్ష్మమ్మ యందు
హెమ్మాడియునుఁ, జిన్నహెమ్మాడి విభుఁడు
ననఁబ్రసిద్ధి వహించు నాత్మజ ద్వయముఁ
గని;రందులో వంశకరుఁడయి మించు
చిన్నహెమ్మాడికి సింగల దేవి
యెన్నఁబుత్రుని రాఘవేంద్రునిం గాంచె;
ఆతండు చందాంబ యందుఁ దనూజుఁ
దాతపిన్నయ్యఁ బ్రతాపాఢ్యుఁ గనియె;
నమితారి తాతపిన్నమహీవిభుండు
సమితిలోఁ జెరకు రాచనరేంద్రు గెలిచి
511
అలవుగా సప్తాంగహరణం బొనర్చి
పొలుపొందె భువి మన్నెపులి యనుపేర
బిరుదాంచితుఁడు తాతపిన్న భూవరుఁడు;
హరికాంతఁ బోలు సూరాంబిక యందు
ఘనశౌర్యుఁ డగు కోటికంటిరాఘవుని
గనియె; నతఁడు సంగరమముల నందు
రాజిల్లు కంపిలిరాయ సైన్యములఁ
దేజంబు మెఱయంగ దెగువమై గెలిచి
గరిమఁ గైకొనియె నగ్గండర గూళి
బిరుదంబు సరినృపుల్పేర్కొని పొగడ;
మఱియు నా పిన్నయ మనుజేంద్రచంద్రు
కొఱలు రెండవ పత్నిగొంకలదేవి
సోమవంశాంబుధిశోభిత సోము
సోమిదేవుం డను శూరునిం గనియె;
నరుల కసాధ్యమైనమొసలి మడుఁగు,
ధరనెన్నఁదగిన సాతాని కోటయును,
కడునుతింపఁగజాలు కందనవోలు,
కడిమి విశేషంబుగల కల్వకొలను,
అరుదైన రాచూరుగల మేతగిరియు,
నిరుపమం బగు గంగినేని కొండయును
521
ననఁగ నొప్పారు నేడైన దుర్గముల
వినుత ధాటీ మహావేశంబు నెఱపి
......................................................................................
గమనిక
ఇక్కడ సుమారు 12-15 ద్విపదలు లభ్యం కాలేదు
....................................................................................
537
మఱియు నతం డాజి మహమదు మలకఁ[49]
గఱకఱి నెదిరి యగ్గలికఁ[50] బట్టించిఁ
బెలుకుఱి[51] యాతండు బిడ్డఁ బేరిడినఁ
దలఁ[52]కెల్లఁ దలఁగించి దయసేసెఁ గాచి
[49] సోమదేవుఁడు మహమ్మదు మలకను (మాలిక్ మహమ్మద్) పెక్కు పర్యాయములు ఓడించినట్లు రామరాజీయము 180వ పద్యములో చెప్పబడినది. ఈ మహమ్మదు మలక బహమనీ సుల్తానగు మొదటి మహమ్మదు అని డా. రంగస్వామి సరస్వతి గారు Sources of Vijayanagar History లో వ్రాశారు. ఆ విధంగా చూస్తే, సోమదేవుడు మొదటి బుక్కరాయలకు సమకాలీను డవుతాడు. (సౌజన్యము-శ్రీమతి బూదూరు కుసుమాంబ
[50] కఱకఱి- బాధ, అగ్గలికము- శౌర్యం, విజృంభణము
[51] పెలుకుఱు- భయాదులచే విహ్వలమగు
[52] తలకు- భయము, బెదురు
541
తెలివి నర్వదినూఱు తేజీల[53] నచటఁ
గలుగు నర్థులకుఁ ద్యాగంబుగా నొసఁగె;
అరుదుగా మఱియును నతఁ డరిబిరుద,
తురియధట్ట, సమస్తదుర్గ విభాళ,
మాళవ రాజేంద్రమస్తక శూల,
చాళుక్య చక్రేశ, జగనొబ్బగండ,
మన్నెసురత్రాణ మానిత బిరుద,
మన్నెర గండ, సోమకుల ప్రదీప
ధరణీంద్ర, యీ బిరుదరగండముఖ్య
బిరుద జాలంబుచేఁ బెంపు వహించె;
నయవిశారదుఁడు పిన్నయసోమ విభుఁడు
జయశాలి భూపాలసార్వ భౌముండు
మనుజేశ! యతఁడు కామలదేవి యందుఁ
గనియె మహాత్ము రాఘవదేవ నృపతి;
అతనికిఁ జిన్న భూపాగ్రణి యొదవె
సతత సౌభాగ్య బాచల దేవి యందు;
ఆపిన్న భూపాలుఁ డారెవీడనఁగ
నేపారు పురిఁ దన కిరవుగా నిలచి
సకల మహీపాలజాలంబుఁ గొలువఁ
బ్రకటిత తేజుఁడై రాజ్యంబు సేసె;
[53] తేజీ- మేలుజాతి గుఱ్ఱము విశ్షము
551
ప్రభవించె నతని కౌభళ దేవి యందు
ప్రభుమణి బుక్క భూపాలచంద్రుండు
యెక్కువ గుణముల నియ్యారెవీటి
బుక్కనరేంద్రుండు భువిఁ బుట్టు నంత
వారిజాప్తోదయవర్ణిత వేళఁ
దారల గతి యయ్యెఁ దక్కు రాజులకు
నరనాథ మణి సాళ్వనరసింగ రాయ
వరసఖుండయి బుక్కవసుధీశుఁ డలరె;
బుక్కభూపాలుండు బుధులకు నెల్ల
దిక్కితఁడె యనంగ దేజంబు నొందె
ఆమహీపతికి బల్లాంబిక యందు
రామనృపాలుండు రాజేంద్రుఁ డొదవె;
హరిపాద తీర్థంబునందు బాంధువులు
గరళంబు వెట్టినగతి యెఱింగియును
తెఱఁగొప్పు బుద్ధిఁ దత్తీర్థంబు నాని
యఱగించు కొనియె రామావనీవిభుఁడు;
హరిభక్తి నారద వ్యాసాంబరీష
హరిపుత్రులకు సాటియనవచ్చు నతని
ఆరామ భూపతి కంగనామణులఁ
పేరైన యౌభళాంచిక లక్కమమ్మ
561
యంబుజనేత్రి రంగమ్మయు నమల
మాంబయు నన గల్గురై;రందులోన
ఔభళాంబికకు రాయన రాజు గోప
భూభుజుండును నను పుత్రులై; రందు
శ్రీలుండు రాయనక్షితిపతి శీల
లాలిత యైన వల్లభదేవి యందు
వరద భూపతి, బల్లవసుధేశ మణుల
నిరువురుఁ దనయుల నేపార గాంచె;
గోపభూవరునకు గుల శీలరూప
దీపిత యౌభళదేవి మోదమున
యెనలేని పంచ రాజేంద్రుని రాయ
జననాథు గనియె రాజకము నుతింప;
యింకలక్కమదేవి కెసఁగు సంతాన
మంకించి పలికెద నాలింపు మధిప;
ఆరామనృపు లక్కమాంబ పుణ్యమున
ధీరతా హేమాద్రిఁ దిమ్మ భూవరుని
వరకీర్తి కొండ భూవరుని శ్రీరంగ
ధరణీశు మువ్వురఁ దనయులఁ గాంచె;
అందగ్రజుం డైన యాతిమ్మ నృపతి
యిందువంశ వతంస మితఁ డన వెలసె;
571
రాజశిరోమణి రాజులరాజు
రాజచంద్రుఁడు రామరాజుతిమ్మయ్య
వేయిమోములు రెండువేలు జిహ్వలును
పాయక కలిగిన ఫణిపతియైన
ప్రణుతించి రామభూపతితిమ్మరాజు
గుణముల నెన్న శక్తుండగు నెటుల
ఆవిభునకు సిద్ధమమ్మయు, లక్ష్మి
దేవి,గోపమదేవి, తిరుమలదేవి
యనఁగ నల్గురు భార్యలై;రందులోన
ననుమోదమునఁ బెద్దయగు సిద్ధమాంబ
రాజిత కీర్తి విక్రములగు కొండ
రాజునుఁ, దిరుమలరాజప్పరాజు,
రామరాజు ననంగ రహిమించు సుతుల
ధీమాననీయులఁ దిరముగా గనియె;
అందుకొండ్రాజు తొయ్యలి కోనమాంబ
యిందుజిద్యశుఁడు కోనేటితిమ్మయ్యఁ
బలుమరు గొండ్రాజుఁ బలుపారఁ గనియె;
వెలయంగఁ గోనమ్ము వెంకటేశ్వరుని
(తులలేని దాక్షిణ్యపువరముతో న)
తులితశాత్రవ మహీధుర్యునిం గనియె;
581
వినుతింపఁదగు రామవిభు వెంగళాంబ
యినతేజుఁడగు నౌభళేశునిం గనియె;
అమిత వైభవుఁ డైన యప్పలరాజు
రమణీయమైన కూరకచెర్ల యొద్ద
కడుమించు నాజిరంగంబునం గడిమిఁ
దొడరి సవాబరీదుల నిర్జయించి
తరణిమండల విభేదన పూర్వకముగ
సురలోకమునకు రాజులు మెచ్చ నరిగె;
రామయతిమ్మ భూరమణుని కీర్తి
ధామమౌ రెండవ తరుణి లక్ష్మమ్మ
తిమ్మభూవరు పేర దిమ్మ నరేంద్రు
సమ్మదంబునఁ గాంచె సౌభాగ్య మలర;
ఆపార్థివోత్తము నర్థాంగలక్ష్మి
గోపమాంబికసతి గుణ నిధానంబు;
గోపమాంబయుఁ దిమ్మకుంభినీశుండు
నేపైన భక్తి లక్ష్మీశుఁ బూజించి
మహిమతోఁ దిరుమల మనుజనాథుండు
విహిత దిగ్విజయుండు విఠ్ఠలేశ్వరుఁడు
రాజిల్లు చినతిమ్మరాజేంద్ర నీవు
తేజంబుగల పాపతిమ్మ భూపతియు
591
ననునట్టి నలువుర నాత్మ సంభవులఁ
గనిరిందు వంశంబు ఘనతకునెక్క;
శూరుండు భూషితసోమవంశుండు
ధీరతా హేమాద్రితిరుమల నృపతి
సకల తీర్థంబులఁ జరియింపఁ గలుగు
సుకృత మా జలనాథుఁ జూచినం గలుగు;
అతనికి నవరజుం డతుల వైభవుఁడు
జితవైరి విఠ్ఠల క్షితినాయకుండు
హరివిఠ్ఠలోర్వీశుఁడైయద్భుతముగ
హరిదంతరముల శౌర్యంబున గెలిచె;
అన్నరేంద్రోత్తమునను జన్మ వృత్తిఁ
జెన్నొంది మించిన చినతిమ్మ భూప!
తలయెత్త నేర్చు నత్తరినె ధర్మంబుఁ
దలయెత్తఁ జేసితి ధరణీతలమున
తొలిదొలినాడు ముద్దుల మాటలపుడె
సలుప నేర్చితి సత్యసంధా వ్రతంబు
సరినృపుల్ ప్రజలును జయవెట్టఁ జంద్ర
గిరిముఖ్య దుర్గముల్ కినుకఁ గైకంటి[54]
నిలిచి వెంటాడి తానెమ్మెల దిరుగు
ఖలశత్రురాజమృగశ్రేణి మీఁద
[54] చంద్రగిరి దుర్గము అనాదిగా విజయనగర రాజులది. ఈ చిన తిమ్మరాజు క్రీ.శ. 1542లో సదాశివరాయల వారి తరఫున చంద్రగిరి రాజ్యమును పరిపాలించుచు స్వతంచేసుకున్నాడు.