పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : వ్యాసచింత

  •  
  •  
  •  

1-82-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యడిగిన, శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుం డిట్లనియెఁ”దృతీయం బైన ద్వాపరయుగంబు దీఱు సమయంబున నుపరిచరవసువు వీర్యంబున జన్మించి, వాసవి నాఁ దగు సత్యవతి యందుఁ బరాశరునికి హరికళం జేసి, విజ్ఞాని యయిన వేదవ్యాసుండు జన్మించి యొక్కనాఁడు బదరికాశ్రమంబున సరస్వతీనదీ జలంబుల స్నానాది కర్మంబులం దీర్చి శుచియై, పరులు లేని చోట నొంటిఁ గూర్చుండి సూర్యోదయవేళ నతీతానాగతవర్తమానజ్ఞుం డయిన యా ఋషి వ్యక్తంబు గాని వేగంబుగల కాలంబునం జేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు వొందు; యుగయుగంబుల భౌతిక శరీరంబు లకు శక్తి సన్నంబగుఁ బురుషులు నిస్సత్త్వులు, ధైర్యశూన్యులు, మందప్రజ్ఞు, లల్పాయువులు, దుర్బలులు, నయ్యెద రని, తన దివ్యదృష్టిం జూచి, సర్వవర్ణాశ్రమంబులకు హితంబు సేయం దలంచి, నలుగురు హోతలచేత ననుష్ఠింపందగి ప్రజలకు శుద్ధికరంబు లైన వైదిక కర్మంబు లగు, యజ్ఞంబు లెడతెగకుండుకొఱకు నేకం బయిన వేదంబు, ఋగ్యజుస్సామాధర్వణంబులను నాలుఁగు నామంబుల విభాగించి, యితిహాస పురాణంబు లన్నియుఁ బంచమవేదం బని పల్కె నందు.

టీకా:

అని = ఆవిధంగ; అడిగిన = అడుగినప్పుడు; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; ముని = మునులలో; శ్రేష్ఠుల = శ్రేష్ఠమైనవారల; కున్ = కు; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; తృతీయంబు = మూడవది; ఐన = అయినట్టి; ద్వాపరయుగంబు = ద్వాపర యుగము; తీఱు = పూర్తియగు; సమయంబునన్ = సమయములో; ఉపరిచర = ఉపరిచరుడు అను; వసువు = వసువుయొక్క; వీర్యంబునన్ = వీర్యమునందు; జన్మించి = పుట్టిన; వాసవి = వాసవి; నాఁదగు = నామముకలదైన; సత్యవతి యందున్ = సత్యవతికి; పరాశరు = పరాశర ఋషి; కిన్ = కి; హరి = హరియొక్క; కళన్ = అంశ; చేసి = చేత; విజ్ఞాని = విజ్ఞాని; అయిన = అయినట్టి; వేద = వేదములకు సంబంధించిన; వ్యాసుండు = వ్యాసుడు; జన్మించి = అవతరించి; ఒక్క = ఒక; నాడు = దినమున; బదరిక = బదరిక అను (బదరిక - రేగి చెట్లు); ఆశ్రమంబున = ఆశ్రమములో; సరస్వతీ = సరస్వతీ; నదీ = నదియొక్క; జలంబులన్ = నీటిలో; స్నాన = స్నానము; ఆది = మొదలగు; కర్మంబులన్ = పనులను; తీర్చి = పూర్తిచేసి; శుచి = శుభ్రముగను; ఐ = అయి; పరులు = ఇతరులు; లేని = లేని; చోటన్ = ప్రదేశమున; ఒంటిన్ = ఒంటరిగ; కూర్చుండి = కూర్చుని; సూర్యోదయ = ఉదయపు; వేళన్ = సమయములో; అతీత = జరిగినది, భూత; అనాగత = జరుగబోవునది, భవిష్య; వర్తమాన = జరుగుచున్నది, వర్తమాన; అజ్ఞుండు = తెలిసినవాడు; అయిన = అయినట్టి; ఆ = ఆ; ఋషి = ఋషి; వ్యక్తంబు = తెలియ; కాని = రానంత; వేగంబు = వేగము; కల = కలిగిన; కాలంబునన్ = కాలమున; చేసి = చేసి; యుగ = యుగములయొక్క; ధర్మంబులు = ధర్మముల; కున్ = కు; భువి = భూమిని; సాంకర్యంబున్ = సంకరత్వము, కల్తీ; పొందున్ = కలుగును; యుగయుగంబులన్ = యుగయుగాలకి; భౌతిక = భూతములకు సంబంధించిన; శరీరంబులు = (జీవుల) శరీరములు; కున్ = కు; శక్తి = బలము; సన్నంబు = తక్కువ; అగున్ = అగును; పురుషులు = మానవులు; నిస్సత్త్వులు = సత్తువలేనివారు; ధైర్యశూన్యులు = ధైర్యము లేనివారు; మందప్రజ్ఞులు = సామర్థ్యము మందగించినవారు; అల్పాయువులు = అల్పమైన ఆయువు గలవారు; దుర్బలులు = బలము తక్కువ గలవారును; అయ్యెదరు = పుట్టెదరు; అని = అని; తన = తనయొక్క; దివ్యదృష్టిన్ = దివ్యదృష్టితో; చూచి = గమనించి; సర్వ = సమస్త; వర్ణ = నాలుగు వర్ణాలకు {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమంబులు = నాలుగు ఆశ్రమాల {చాతురాశ్రమములు - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస.}; కున్ = కు; హితంబున్ = మేలు; సేయన్ = చేయాలి అని; తలంచి = తలచి; నలుగురు = నలుగురు; హోతలు = హోమము చేయు వారల; చేతన్ = చేత; అనుష్ఠింపన్ = నిర్వహించుటకు; తగి = తగినట్టి; ప్రజలు = లోకులు; కున్ = కు; శుద్ధి = పరిశుద్ధి; కరంబులు = కలుగజేయునవి; అయిన = అయినట్టి; వైదిక = వేద; కర్మంబులు = కర్మములు; అగు = అయినట్టి; యజ్ఞంబులు = యజ్ఞములు; ఎడతెగక = ఆగకుండగ; ఉండు = ఉండుట; కొఱకున్ = కోసము; ఏకంబు = అవిభక్తము; ఐన = అయిన; వేదంబున్ = వేదమును; ఋక్ = ఋగ్వేదము; యజుస్ = యజుర్వేదము; సామ = సామవేదము; అధర్వణంబులు = అధర్వణవేదములు; అను = అను; నాలుఁగు = నాలుగు; నామంబులన్ = పేర్లతో; విభాగించి = విభజించి; ఇతిహాస = ఇతిహాసములు; పురాణంబులు = పురాణములు; అన్నియున్ = అన్నిటిని కలిపి; పంచమవేదంబు = పంచమ వేదము; అని = అని; పల్కెన్ = పలికెను; అందున్ = వాటిలో.

భావము:

అలా అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూతమహర్షి ఇలా చెప్పసాగాడు”మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో, సరస్వతీనదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తిచేసుకొని శుచియై, సూర్యోదయ సమయంలో ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్య ద్వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మంద బుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారనీ తన దివ్య దృష్టితో తెలుసుకొన్నాడు. అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు. బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదికకర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజస్సు, సామము, అథర్వణము అనే నాలుగు వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు.

1-83-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పైలుండు ఋగ్వేద ఠనంబు దొరఁకొనె,-
సామంబు జైమిని దువుచుండె,
జువు వైశంపాయనాఖ్యుండు గైకొనెఁ,-
దుది నధర్వము సుమంతుఁడు పఠించె,
ఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి-
రోమహర్షణుఁడు నిరూఢిఁ దాల్చెఁ,
మతమ వేద మా పసులు భాగించి-
శిష్యసంఘములకుఁ జెప్పి రంత

1-83.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల
కంత బహుమార్గములు సెప్పి నుమతింపఁ;
బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన
నిగమ మొప్పారె భూసుర నివహమందు.

టీకా:

పైలుండు = పైలుడు; ఋగ్వేద = ఋగ్వేదము యొక్క; పఠనంబు = చదువుకొనుట; దొరఁకొనెన్ = పూనుకొన్నాడు; సామంబు = సామ వేదము; జైమిని = జైమిని; సదువుచున్ = పఠిస్తూ; ఉండెన్ = ఉన్నాడు; యజువు = యజుర్వేదము; వైశంపాయన = వైశంపాయనుడు; ఆఖ్యుండు = అనుపేరు గలవాడు; కైకొనెన్ = తీసుకొన్నాు; తుదిన్ = చివరకు; అధర్వంబు = అధర్వణవేదము; సుమంతుఁడు = సుమంతుడు; పఠించెన్ = చదువుకొన్నాడు అఖిల = సమస్తమైన; పురాణ = పురాణములు; ఇతిహాసముల్ = ఇతిహాసములు; మా = మా; తండ్రి = తండ్రి; రోమహర్షణుఁడు = రోమహర్షణుడు; నిరూఢిన్ = నిష్ఠగా; తాల్చెన్ = ధరించాడు; తమతమ = వారివారి; వేదము = వేదములను; ఆ = ఆ; తపసులు = తాపసులు; భాగించి = విభజించి; శిష్య = శిష్యులయొక్క; సంఘములు = సమూహములు; కున్ = కు; చెప్పిరి = బోధించారు; అంతన్ = అంతట;
శిష్యులు = శిష్యులు; ఎల్లను = అందరును; ఆత్మీయ = తమయొక్క; శిష్యజనులు = శిష్యులు; కున్ = కు; అంత = అంతట; బహు = పెక్క; మార్గములు = విధములు; చెప్పి = చెప్పి; అనుమతింపన్ = అనుమతింపగా; పెక్కు = అనేక; శాఖలు = శాఖలు; కలిగి = ఏర్పడి; ఈ = ఈ; పృథివి = భూప్రపంచము; లోనన్ = లోపల; నిగమము = వేదము; ఒప్పారెన్ = ప్రకాశించెను; భూసుర = బ్రాహ్మణుల; నివహమందు = సమూహములో.

భావము:

పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు. జైమిని సామవేదం చదువసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. సుమంతుడు అథర్వ వేదాన్ని ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యు లందయా తమ తమ శిష్యులకు అనేక విధాలూగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది.

1-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మేధావిహీను లయిన పురుషులచేత నట్టి వేదంబులు ధరియింపబడు చున్నవి; మఱియు దీనవత్సలుం డయిన వ్యాసుండు స్త్రీ శూద్రులకుం ద్రైవర్ణికాధములకు వేదంబులు విన నర్హంబులుగావు గావున మూఢుల కెల్ల మేలగు నని భారతాఖ్యానంబు చేసియు నమ్ముని భూతహితంబు నందుఁ దన హృదయంబు సంతసింపకున్న సరస్వతీతటంబున నొంటి యుండి, హేతువు వితర్కించుచుఁ దనలో నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; మేధా = ప్రజ్ఞ; విహీనులు = లేనివారు; అయిన = అయినట్టి; పురుషులు = మానవులు; చేతన్ = చేత; అట్టి = అట్టి; వేదంబులు = వేదములు; ధరియింపబడుచున్ = స్వీకరింపబడుతూ; ఉన్నవి = ఉన్నవి; మఱియున్ = ఇంకను; దీన = దీనులందు; వత్సలుండు = దయగలవాడు; అయిన = అయినట్టి; వ్యాసుండు = వ్యాసుడు; స్త్రీ = స్త్రీలకు; శూద్రులు = శూద్రులు; కున్ = కును; త్రై = మూడు; వర్ణిక = వర్ణములలోని; అధములు = అధములు; కున్ = కున్; వేదంబులు = వేదములు; వినన్ = వినుటకు; అర్హంబులు = సమర్థంబులు; కావు = కావు; కావునన్ = అందువలన; మూఢులు = మూఢులు; కున్ = కు; ఎల్లన్ = అందరికిని; మేలు = మేలు; అగును = కలుగును; అని = అని; భారత = భారతము; ఆఖ్యానంబు = రచన; చేసియున్ = చేసినప్పటికిని; ఆ = ఆ; ముని = ముని; భూత = జీవులకు; హితంబు = మేలు చేయుట; అందున్ = లో; తన = తనయొక్క; హృదయంబు = హృదయము; సంతసింపక = సంతోషింపకుండా; ఉన్న = ఉండగా; సరస్వతీ = సరస్వతీనదియొక్క; తటంబునన్ = ఒడ్డుమీద; ఒంటి = ఒంటరిగా, ఏకాంతముగ; ఉండి = నిలిచి; హేతువు = కారణము; వితర్కించుచున్ = చింతించుచు; తనలోన్ = తనలోతాను, స్వగతంగా; ఇట్లు = ఈవిధంగా; అనియెన్ = అనుకొన్నాడు.

భావము:

ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధు లైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. బ్రహ్మ బంధువులు, స్ర్తీలు, శూద్రులు, వేద శ్రవణానికి సమర్థులు కారు కనుక, సామాన్యు లందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అయినప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు.

1-85-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వ్రతధారినై వేదహ్ని గురుశ్రేణి-
న్నింతు, విహితకర్మములఁ గొఱఁత
డకుండ నడుపుదు, భారతమిషమునఁ-
లికితి వేదార్థభావ మెల్ల,
మునుకొని స్త్రీశూద్రముఖ్యధర్మము లందుఁ-
దెలిపితి నేఁజెల్ల, దీనఁ జేసి
యాత్మ సంతస మంద, దాత్మలో నీశుండు-
సంతసింపక యున్న జాడ దోఁచె,

1-85.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికి యోగివరుల భిలషితంబైన
భాగవత విధంబుఁ లుకనైతి,
మోసమయ్యెఁ దెలివి మొనయదు, మఱచితి"
నుచు వగచుచున్న వసరమున.

టీకా:

వ్రతధారిని = నిష్ఠలో నున్న వానిగ; ఐ = అయ్యి; వేద = వేదముల {వేదములు - 4 ఋక్ ,యజు, సామ, అధర్వణ వేదములు}; వహ్ని = అగ్నుల {త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2దక్షిణాగ్ని, 4గార్హపత్యము}; గురు = గురువుల {గురువులు - కన్నతండ్రి, పెంచినతండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, కులముపెద్ద, తండ్రితోడ పుట్టిన వాడు, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడినవాడు.}; శ్రేణి = సమూహమును; మన్నింతున్ = గౌరవింతును; విహిత = వేదములలో విధింపబడిన; కర్మములన్ = పనులలో; కొఱఁత = లోపము; పడకుండన్ = లేకుండా; నడుపుదు = నడిపిస్తాను; భారత = భారతమనే; మిషమునన్ = వంకతో; పలికితి = వెల్లడించితిని; వేద = వేదములయొక్క; అర్థ = ప్రయోజనము; భావము = సారాంశము; ఎల్లన్ = అంతటిని; మునుకొని = పూనుకొని; స్త్రీ = స్త్రీలకు; శూద్ర = శూద్రులకు; ముఖ్య = ముఖ్యమైన; ధర్మములు = ధర్మములు; అందున్ = అందులో; తెలిపితిన్ = తెలియ జేసితిని; నేన్ = నేను; చెల్లన్ = చెలఁగి, ఉత్సాహముతో; దీనఁన్ = దీని; చేసి = వలన; ఆత్మ = ఆత్మ; సంతసము = సంతోషము; అందదు = పొందదు; ఆత్మ = ఆత్మ; లోన్ = లోని; ఈశుండున్ = ఈశ్వరుడు; సంతసింపక = సంతోషింపకుండగ; ఉన్న = ఉన్న; జాడన్ = విధముగ; తోఁచెన్ = తోచుచున్నది;
హరి = శ్రీహరి; కిన్ = కి; యోగి = యోగులలో; వరులు = శ్రేష్ఠులు; కున్ = కు; అభిలషితంబు = అత్యంత ప్రియము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము యొక్క {భాగవతము - భగవంతునికి సంబంధించినదైన}; విధంబున్ = విషయమును; పలుకన్ = వివరింపలేని వాడను; ఐతిన్ = అయితిని; మోసము = ప్రమాదము; అయ్యెన్ = జరిగెను; తెలివి = తెలివి; మొనయదు = చేకూరలేదు; మఱచితిన్ = మరచిపోయితిని; అనుచు = అనుకొనుచు; వగచుచున్న = బాధపడుతున్న; అవసరమునన్ = సమయములో.

భావము:

“దీక్ష చేపట్టిన వాడినై, వేదాలను విభజించాను. అగ్నులను అర్చించాను. ఆచార్యులను గౌరవించాను. శాస్ర్తోక్తాలైన కర్మలన్నీ ఏ మాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. వేదాల్లోని అర్థాన్నంతా మహాభారత రూపంలో వెల్లడించాను. ఈ రూపంగా స్ర్తీలు శూద్రాదులు సహితం తమ తమ ధర్మకర్మలు గుర్తించేటట్లు చేశాను. ఇంత చేసినా ఎందుకో గాని నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తున్నది. కారణం ఏమిటో. అన్నీ చేశాను కాని హరికీ, హరిభక్తులైన పరమ హంసలకూ అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మరచిపోయాను. ఎంత పొరపాటు చేశాను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఎంతటి విస్మృతి పాలయ్యాను” అని వ్యాసమహర్షి విచారిస్తూ కూర్చున్నాడు.