శ్రీ పోతన రామాయణము : శ్రీ పోతన రామాయణము 1వ. భాగము
శ్రీ పోతన రామాయణము
9-ప్రార్థన
9-1-క.
శ్రీరాజిత! మునిపూజిత!
వారిధి గర్వాతిరేక వారణ బాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల
సారయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా!
భావము:- లక్ష్మిగలిగి ప్రకాశించే వాడా! మునులు పూజించు వాడా! సముద్రుడి గర్వం సర్వం పోగొట్టిన బాణం గల వాడా! పండితులను కాపాడే వాడా! బహు ప్రకాశవంతమైన గొప్పకీర్తి గల వాడా! శ్రీరామచంద్ర ప్రభూ! అవధరించు.
9-శ్రీరాముని కథనంబు
9-258-వ.
అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘబాహునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును, పుట్టి; రా దశరథునకు సురప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించె; తచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుం జెప్పెద సావధానమనస్కుండవై యాకర్ణింపుము.
భావము:
ఆ ఖట్వాంగుడికి దీర్ఘబాహుడు, దీర్ఘబాహునికి రఘువు, రఘువుకు పృథుశ్రవణుడు, పృథుశ్రవణునికి అజుడు, అజునికి దశరథుడు జన్మించారు. దేవతలు వేడగా పరబ్రహ్మ స్వరూపుడు నారయణుడు నాలుగు (4) రకాలుగ అయ్యి, ఆ దశరథునికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే పేర్లతో తన అంశతో అవతరించి పుట్టాడు. వారి కథను వాల్మీకి మున్నగు మహర్షుల వలన వివరింపబడింది. ఆ ఇతిహాసాన్ని చెప్తాను శ్రద్ధగా విను.
9-259-మ.
అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితుండైనట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డా గరితకుం గౌసల్యకున్ సన్నుతా
సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్.
భావము:
తూర్పుదిక్కున నిండుచంద్రుడు ఉదయించినట్లు; పతివ్రత, పరిశుద్ధురాలు, సంసారసాఫల్యం పొందినామె, సాటిలేని సాధ్వీ ఐన కౌసల్యాదేవికి; గర్వాంథుడైన రావణుని తలలు నరకుటలో ఆరితేరినవాడు శ్రీరాముడు, విష్ణుమూర్తి అంశతో జన్మించాడు.
9-260-మ.
సవరక్షార్థము దండ్రి పంపఁ జని విశ్వామిత్రుఁడుం దోడరా
నవలీలం దునుమాడె రాముఁ డదయుండైబాలుఁడై కుంతల
చ్ఛవిసంపజ్జితహాటకం గపటభాషావిస్ఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం గరవిరాజత్ఖేటకం దాటకన్.
భావము:
చిన్నపిల్లవాడుగా ఉండగా శ్రీరాముడిని తండ్రి యజ్ఞం కాపాడటానికి మహర్షి విశ్వామిత్రుని వెంట పంపించాడు. అక్కడ ఉన్న రాకాసి తాటకి బంగారు రంగు జుట్టు కలది, కపట పలుకులతో నాటకాలు ఆడేది, సూర్యుని గుఱ్ఱాలను మించిన వేగం కలది. చేతిలో గొప్పడాలు కలది. అలాంటి తాటకిపై ఏమాత్రం దయ చూపకుండా శ్రీరాముడు దానిని సుళువుగా సంహరించాడు.
9-261-క.
గారామునఁ గౌశిక మఖ
మారాముఁడు గాచి దైత్యు నధికు సుబాహున్
ఘోరాజిఁ ద్రుంచి తోలెన్
మారీచున్ నీచుఁ గపటమంజులరోచున్.
భావము:
శ్రీరాముడు భీకర యుద్ధంచేసి రాక్షసుడైన సుబాహుని చంపాడు. కపటవేషం వేసిన దుర్మార్గుడు మారీచుని తరిమికొట్టాడు. కౌశికుడు అను మరొక పేరు గల విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు.
9-262-మ.
ఒకమున్నూఱు గదల్చి తెచ్చిన లలాటోగ్రాక్షుచాపంబు బా
లకరీంద్రంబు సులీలమైఁ జెఱకుఁగోలంద్రుంచు చందంబునన్
సకలోర్వీశులు చూడఁగా విఱిచె దోశ్శక్తిన్ విదేహక్షమా
పకగేహంబున సీతకై గుణమణిప్రస్ఫీతకై లీలతోన్.
భావము:
సుగుణాల ప్రోవు సీతాదేవి కోసం, ఆమె తండ్రి విదేహరాజు జనకుని ఇంట, రాజలోకం అందరు చూస్తుండగా, మూడువందల మంది కదలించి తీసుకువచ్చిన శివధనుస్సును, గున్న ఏనుగు అవలీలగా చెరుకు గడను విరిచినట్లు అతి సుళువుగా విరిచేసాడు.
9-263-క.
భూతలనాథుఁడు రాముఁడు
ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్భాగ్యోపేతన్
సీతన్ముఖకాంతివిజిత సితఖద్యోతన్.
భావము:
లోకనాయకుడు అయిన శ్రీరాముడు గొప్ప గుణవంతురాలు, అదృష్టవంతురాలు మఱియు చంద్రుని మించిన కాంతివంతమైన ముఖము కలిగిన సీతాదేవిని ప్రీతితో పెళ్ళిచేసుకొన్నాడు
9-264-క.
రాముఁడు నిజబాహుబల
స్థేమంబున భంగపఱిచె దీర్ఘకుఠారో
ద్దామున్విదళీకృతనృప
భామున్రణరంగభీము భార్గవరామున్.
భావము:
శ్రీరాముడు తన భుజబలాతిశయంతో; గొడ్డలి ఆయుధం పట్టే గండరగండడిని, రాజలోకం అందరి రోషం పటాపంచలు చేసిన వాడిని, భీకరమైన యుద్ధం చేసేవాడిని, పరశురాముడిని భంగపరచాడు.
9-265-క.
దశరథుఁడు మున్ను గైకకు
వశుఁడై తానిచ్చి నట్టి వరము కతన వా
గ్దశచెడక యడివి కనిచెను
దశముఖముఖకమలతుహినధామున్ రామున్.
భావము:
దశరథుడు ఇంతకు ముందు తాను కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి రావణుని ముఖ కమలాలకు చంద్రునివంటి వాడైన శ్రీరాముడిని అడవికి పంపించాడు.
9-266-క.
జనకుఁడు పనిచిన మేలని
జనకజయును లక్ష్మణుండు సంసేవింపన్
జనపతి రాముఁడు విడిచెను
జనపాలారాధ్య ద్విషదసాధ్య నయోధ్యన్.
భావము:
అయోధ్య రాజులచే పూజినీయమైనది. శత్రువులకు సాధింపరానిది. అట్టి అయోధ్యను తండ్రి ఆజ్ఞను శిరసావహించి సీతాదేవి, లక్ష్మణుడు తనను సేవిస్తుండగా శ్రీరాముడు వదిలి పెట్టెను.
9-267-క.
భరతున్ నిజపదసేవా
నిరతున్ రాజ్యమున నునిచి నృపమణి యెక్కెన్
సురుచిర రుచి పరిభావిత
గురుగోత్రాచలముఁ జిత్రకూటాచలమున్.
భావము:
తన పాదాసేవానురక్తుడైన భరతుడిని రాజ్య పాలన యందు నియమించాడు. పిమ్మట, కులపర్వతాలను మించిన రమణీయమైన కాంతులు గల చిత్రకూటపర్వతాన్ని రాజశేఖరుడు శ్రీరాముడు ఎక్కాడు.
9-268-ఉ.
పుణ్యుఁడు రామచంద్రుఁ డట పోయి ముదంబునఁ గాంచె దండకా
రణ్యముఁ దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హి బర్హ లా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటనప్రభూత సా
ద్గుణ్యము నుల్లసత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
భావము:
పుణ్యాత్ముడైన శ్రీరామచంద్రుడు అలా వెళ్ళి ఋషీశ్వరుల సమాశ్రయము, పురివిప్పి ఆడే నెమళ్ళతో మనోజ్ఞమైనది, పవిత్ర గోదావరీ జలాలతో విలసిల్లేది, గొప్ప చెట్లు పొదలుతో కూడినది ఐన విశిష్టమైన దండకారణ్యాన్ని సంతోషముతో దర్శించాడు.
9-269-సీ.
ఆవనంబున రాముఁ డనుజ సమేతుడై;
సతితోడ నొక పర్ణశాల నుండ
రావణు చెల్లలు రతిఁ గోరి వచ్చిన;
మొగి లక్ష్మణుఁడు దాని ముక్కు గోయ
నది విని ఖరదూషణాదులు పదునాల్గు;
వేలు వచ్చిన రామవిభుఁడు గలన
బాణానలంబున భస్మంబు గావింప;
జనకనందన మేని చక్కఁదనము
భావము:-
9-269.1-తే.
విని దశగ్రీవుఁ డంగజ వివశుఁ డగుచు
నర్థిఁ బంచినఁ బసిఁడిఱ్ఱి యైనటించు
నీచు మారీచు రాముఁడు నెఱి వధించె
నంతలో సీతఁ గొనిపోయె నసురవిభుఁడు.
భావము:
శ్రీరాముడు తమ్ముడితో భార్యతో కలిసి దండకారణ్యంలో ఒక పర్ణశాలలో ఉన్నాడు. అప్పుడు రావణాసురుని చెల్లెలు శూర్పణఖ కామించి వచ్చింది. అంతట లక్ష్మణుడు ఆమె ముక్కు కోసేశాడు. అది విని ఖరుడు దూషణుడు అనే రాక్షసులు పద్నాలుగువేల మంది రాక్షససేనతో దండెత్తి వచ్చారు. శ్రీరామచంద్రుడు యుద్ధంచేసి తన బాణాగ్నిలో వారిని భస్మం చేసాడు. సీత చక్కదనం విని మన్మథ పరవశుడైన రావణుడు మారీచుడిని పంపాడు. ఆ నీచుడు బంగారు లేడి రూపంలో రాగా, శ్రీరాముడు వాడిని వధించాడు. ఆ సమయంలో రావణాసురుడు సీతను తీసుకుపోయాడు.
9-270-ఉ.
ఆయసురేశ్వరుండు వడి నంబరవీథి నిలాతనూజ న
న్యాయము చేసి నిష్కరుణుఁడైకొనిపోవఁగ నడ్డమైన ఘో
రాయతహేతిఁ ద్రుంచె నసహాయత రామనరేంద్రకార్యద
త్తాయువుఁ బక్షవేగపరిహాసితవాయువు నజ్జటాయువున్.
భావము:
దయావిహీనుడైన రాక్షసరాజు అలా మోసం చేసి వేగంగా ఆకాశ మార్గాన సీతను తీసుకుపోతుంటే, రామకార్యం కోసం ఆయుస్సు త్యాగంచేసినది, వాయువేగాన్ని మించిన వేగం గలది అయిన జటాయువు అడ్డగించింది. నిస్సహాయురాలైన ఆ జటాయువును భయంకరమైన పెద్ద ఆయుధంతో రావణుడు సంహరించాడు.
9-271-వ.
అంతనా రామచంద్రుండు లక్ష్మణసహితుండై, సీత వెదక నరుదెంచి, నిజకార్యనిహతుండైన జటాయువునకుఁ పరలోకక్రియలు గావించి, ఋశ్యమూకంబునకుం జని.
భావము:
అప్పుడు, సీతాన్వెషణకై వచ్చిన రామలక్ష్మణులు, రామకార్యంలో ప్రాణాలు త్యజించిన ఆ జటాయువునకు, అంత్యక్రియలు చేసి, ఋశ్యమూకపర్వతానికి వెళ్ళారు.
9-272-క.
నిగ్రహము నీకు వల దిఁక
నగ్రజు వాలిన్ వధింతు నని నియమముతో
నగ్రేసరుఁగా నేలెను
సుగ్రీవుం జరణఘాతచూర్ణగ్రావున్.
భావము:
ఒక్క తన్నుతోనే బండరాళ్ళను పిండిపిండి చేయగల మహ బలశాలి సుగ్రీవుడికి, “ఇకపైన నీకు ఈ నిర్భందం అక్కరలేదు, మీ అన్న వాలిని సంహరిస్తాను” అని అభయం ఇచ్చి, శ్రీరామచంద్ర ప్రభువు పాలించాడు.
9-273-క.
లీలన్రామవిభుం డొక
కోలంగూలంగ నేసె గురు నయశాలిన్
శీలిన్సేవితశూలిన్
మాలిన్వాలిన్ దశాస్యమానోన్మూలిన్.
భావము:
గొప్ప నీతిశాలి, పరమశివ భక్తుడు, ఇంద్రుడు ఇచ్చిన మాల ధరించిన వాడిని, రావణుని గర్వాన్ని హరించినవాడు ఐన వాలిని, శ్రీరాముడు ఒకే ఒక బాణంతో కూల్చివేశాడు.
9-274-క.
ఇలమీఁద సీత వెదకఁగ
నలఘుఁడు రాఘవుఁడు పనిచె హనుమంతు నతి
చ్ఛలవంతున్, మతిమంతున్,
బలవంతున్, శౌర్యవంతు, బ్రాభవవంతున్.
భావము:
గొప్పవాడైన శ్రీరాముడు సీతజాడ వెతుకమని మిక్కిలి చురుకైనవాడు, మహామహిమాన్వితుడు, గొప్ప బుద్ధిమంతుడు, మిక్కిలి బలశాలి, మహా వీరుడు అయిన హనుమంతుని నియోగించాడు.
9-275-క.
అలవాటు కలిమి మారుతి
లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్
జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.
భావము:
బాలునిగా సూర్యుని వరకు గెంతి మింగబోయిన అలవాటు ఉండడంతో మారుతి నదులు అన్నింటికీ బంధువు, భూమికి ఆకాశానికి వ్యవధానం, నీటితో నిండి ఉండేది అయిన సముద్రాన్ని మిక్కిలి లాఘవంగా దాటాడు.
9-276-వ.
ఇట్లు సముద్రంబు దాఁటి సీతం గని, హనుమంతుండు దిరిగి చనుదెంచుచు నక్షకుమారాదుల వధియించి.
భావము:
ఈ విధంగ సముద్రాన్ని దాటి సీతను కనుగొని హనుమంతుడు వెనుకకు వస్తూ అక్షకుమారుడు మున్నగు రాక్షసులను సంహరించాడు.
9-277-క.
సముదగ్రత ననిలసుతుం
డమరాహిత దత్త వాల హస్తాగ్నుల భ
స్మముచేసె నిరాతంకన్
సముదాసురసుభటవిగతశంకన్ లంకన్.
భావము:
మిక్కిలి గొప్పదనంతో వాయుపుత్రు డైన హనుమంతుడి తోక రాక్షసులు అంటించారు. ఆ తోక మంటలతోనే గట్టి రాక్షస సైనికుల రక్షణలో ఉన్న ఆ లంకానగరాన్ని హనుమంతుడు కాల్చివేసాడు.
9-278-వ.
ఇట్లు లంకాదహనంబు చేసివచ్చి వాయుజుండు సీతకథనంబు చెప్పిన విని రామచంద్రుండు వనచరనాథ యూధంబులుం దానును చనిచని.
భావము:
ఈ విధంగా లంకను కాల్చి, వెనుకకు వచ్చి హనుమంతుడు సీత వృత్తాంతం చెప్పగా విని, రామచంద్రుడు వానర సైన్యాలతో రావణాసురుడి మీదకు దాడికి బయలుదేరాడు.
9-279-శా.
ఆరాజేంద్రుఁడు గాంచె భూరివిధరత్నాగారమున్ మీన కుం
భీరగ్రాహకఠోరమున్ విపుల గంభీరంబు నభ్రభ్రమ
ద్ఘోరాన్యోన్యవిభిన్నభంగభవనిర్ఘోషచ్ఛటాంభఃకణ
ప్రారుద్ధాంబరపారమున్ లవణపారావారముం జేరువన్.
భావము:
బహు రత్ననిధిగా ప్రసిద్ధమైనది, భీకరమైన చేపలు, మొసళ్ళు తిమింగలాలతో దాటరానిది, ఆకాశానికి ఎగిసిపడె అలలు కలది, నీటి తుంపరలతో ఆకాశపు అవధులు తాకేది, గంభీరమైన హోరు కలది అయిన ఆ లవణ సముద్రాన్ని దగ్గరగా ఆ రామ రాజశ్రేష్ఠుడు చూసాడు.
9-280-వ.
కని తనకుఁ ద్రోవ యిమ్మని వేఁడిన నదియు మార్గంబు చూపక మిన్నందిన నా రాచపట్టి రెట్టించిన కోపంబున.
భావము:
అలా సముద్రాన్ని చూసి తనకు దారి ఇవ్వమని కోరాడు. కాని సముద్రుడు దారి ఇవ్వకపోవడంతో, ఆ రాముడి కోపం పెరిగిపోయింది.
9-281-క.
మెల్లని నగవున నయనము
లల్లార్చి శరంబు విల్లు నందిన మాత్రన్
గుల్లలు నాఁచులుఁ జిప్పలుఁ
బెల్లలునై జలధి పెద్ద బీడై యుండెన్.
భావము:
చిరునవ్వుతో కళ్ళు చలింపజేసి ధనుర్బాణాలు తీసుకొన్న మాత్రంచేతనే సాగరం ఇగిరిపోయి; నత్తగుల్లలు, నాచులు, ఆల్చిప్పలు, మట్టపెళ్ళలు బైటపడి బీడుపడినట్లు మారిపోయింది.
9-282-వ.
ఇట్లు విపన్నుండగు సముద్రుండు నదులతోఁ గూడి మూర్తి మంతుండయి చనుదెంచి రామచంద్రుని చరణంబులు శరణంబు జొచ్చి యిట్లని స్తుతియించె.
భావము:
ఇలా ఆపదపాలైన సముద్రుడు నదులతో కలిసి రూపు ధరించి వచ్చి శ్రీరాముని పాదాలను శరణువేడాడు. ఇంకా ఈ విధంగా స్తోత్రం చేసాడు.
9-283-శా.
"ఓకాకుత్స్థకులేశ! యోగుణనిధీ! యోదీనమందార! నే
నీకోపంబున కెంతవాఁడ? జడధిన్; నీవేమి భూరాజవే?
లోకాధీశుఁడ; వాదినాయకుఁడ; వీ లోకంబు లెల్లప్పుడున్
నీకుక్షిం బ్రభవించు; నుండు; నడఁగున్; నిక్కంబు సర్వాత్మకా!
భావము:
“ఓయీ! కాకుత్స్థుని వంశ ప్రభువ! ఓ సుగుణనిధీ! ఓ దీనమందార! సర్వాత్మకా! శ్రీరామా! నేను జడస్వభావిని. నీ కోపాన్ని తట్టుకోలేను. నీవు ఏమైనా సామాన్యరాజువా? సకల జగత్తులకు విభుడవు. మూలపూరుషుడవు, ఎల్లప్పుడు నీ కడుపులో సకల భువనాలు సృష్టింపబడుతూ, మనుతూ, లయమవుతూ ఉంటాయి. ఇది సత్యం.
9-284-క.
ధాతల రజమున దేవ
వ్రాతము సత్త్వమున భూతరాశిఁ దమమునన్
జాతులఁగా నొనరించు గు
ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా!
భావము:
సృష్టికర్తలను రజోగుణంతోను, దేవతలను సత్వగుణంతోను జీవజాలాన్ని తమోగుణంతోను పుట్టించే త్రిగుణాలకి అతీతమైన వాడవు. నీవు సకల సుగుణములకే అలంకారం వంటివాడవు.
9-285-క.
కట్టుము సేతువు; లంకం
జుట్టుము; నీ బాణవహ్ని సురవైరితలల్
గొట్టుము నేలంబడఁ; జే
పట్టుము నీ యబల నధికభాగ్యప్రభలన్.
భావము:
ఓ రామా! వంతెన కట్టు, లంకానగరం చుట్టుముట్టు, నీ బాణాగ్నితో రావణుని తలలు నేల రాలగొట్టు, మంగళకరంగా నీ భార్యను స్వీకరించు.
9-286-ఆ.
హరికి మామ నగుదు; నటమీఁద శ్రీదేవి
తండ్రి; నూరకేల తాగడింప?
గట్టఁ గట్టి దాఁటు కమలాప్తకులనాథ!
నీయశోలతలకు నెలవుగాఁగ
భావము:
శ్రీరామ! విష్ణువు అయిన నీ భార్య లక్ష్మీదేవికి నేను తండ్రిని, అలాగ నీకు పిల్లనిచ్చిన మామను. అనవసరంగా నన్ను నిర్భందించడం, పీడించడం ఎందుకు. నీ కీర్తి తీగలు సాగేలా వారధి నిర్మించి దాటుము.
9-287-వ.
అని విన్నవించిన రామచంద్రుండు సముద్రునిం బూర్వప్రకారంబున నుండు పొమ్మని వీడుకొల్పెను; అంత.
భావము:
అని సముద్రుడు మనవి చేసుకొనగా శ్రీరాముడు “ఇక వెళ్ళు ఇదివరకు లాగే ఉండు” అని పంపివేసాడు. అప్పుడు.
9-288-క.
ఘనశైలంబులుఁ దరువులు
ఘనజవమునఁ బెఱికి తెచ్చి కపికులనాథుల్
ఘనజలరాశిం గట్టిరి
ఘనవాహప్రముఖదివిజగణము నుతింపన్.
భావము:
శీఘ్రమే పెద్ద కొండరాళ్ళు, వృక్షాలు పెకిలించి తీసుకొని వచ్చి వానర జాతి నాయకులు సముద్రము మీద నిర్మించారు. ఇంద్రాది దేవతలు అందరూ స్తుతించారు.
9-289-వ.
ఇట్లు సముద్రంబు దాఁటి రామచంద్రుండు రావణు తమ్ముం డైన విభీషణుండు శరణంబు వేఁడిన నభయం బిచ్చి; కూడుకొని లంకకుఁ జని విడిసి వేడెపెట్టించి లగ్గలుపట్టించిన.
భావము:
ఈ విధంగ సముద్రం దాటి శ్రీరాముడు తన అండ కోరిన శత్రువు రావణుని తమ్ముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన పరివారంలో కలుపుకున్నాడు. లంకానగరం వెళ్ళి విడిసి, చుట్టుముట్టి, ముట్టడించాడు. కోటలెక్కించాడు.
9-290-సీ.
ప్రాకారములు ద్రవ్వి పరిఖలు పూడిచి;
కోటకొమ్మలు నేలఁ గూలఁ ద్రోచి
వప్రంబు లగలించి వాకిళ్ళు పెకలించి;
తలుపులు విఱిచి యంత్రములు నెఱిచి
ఘనవిటంకంబులు ఖండించి పడవైచి;
గోపురంబులు నేలఁ గూలఁ దన్ని
మకరతోరణములు మహిఁ గూల్చి కేతనం;
బులు చించి సోపానములు గదల్చి
భావము:-
9-290.1-ఆ.
గృహము లెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి
భర్మకుంభచయము పాఱవైచి
కరులు కొలను చొచ్చి కలఁచిన కైవడిఁ
గపులు లంకఁ జొచ్చి కలఁచి రపుఁడు.
భావము:
మడుగులో ప్రవేశించిన ఏనుగులు కలచివేసినట్లు, వానర సేన లంక ప్రవేశించి అలా కలచివేసింది. ప్రహారీగోడలు తవ్వి, అగడ్తలు పూడ్చివేసి, బురుజులు నేల కూలగొట్టి, కోటలు పగులగొట్టి, గుమ్మాలు పీకేసి, తలుపులు విరగ్గొట్టి, యంత్రాలు చెరిచి, గువ్వగూళ్ళు పడగొట్టి, గోపురాలు కూలగొట్టి, మకరతోరణాలు నేలగూల్చి, జండాలను చింపేసి, మెట్లు కదిలించి, ఇళ్ళు బద్దలుకొట్టి, భవనాలు కూలగొట్టి, బంగారు కలశాలు పారేసి లంకను అల్లకల్లోలం చేసింది. అప్పుడు...
9-291-వ.
అంత నయ్యసురేంద్రుండు పంచినఁ గుంభ, నికుంభ, ధూమ్రాక్ష, విరూపాక్ష, సురాంతక, నరాంతక, దుర్ముఖ, ప్రహస్త, మహాకాయ ప్రముఖులగు దనుజవీరులు శర శరాసన తోమర గదాఖడ్గ శూల భిందిపాల పరశు పట్టిస ప్రాస ముసలాది సాధనంబులు ధరించి మాతంగ తురంగ స్యందన సందోహంబుతో బవరంబు చేయ సుగ్రీవ, పవనతనయ, పనస, గజ, గవయ, గంధమాదన, నీలాం గద, కుముద, జాంబవదాదు లా రక్కసుల నెక్కటి కయ్యంబు లందుఁ దరుల గిరులఁ గరాఘాతంబుల నుక్కడించి త్రుంచి; రంత.
భావము:
అంతట రావణుడు పంపించగా కుంభుడు, నికుంభుడు, ధూమ్రాక్షుడు, విరూపాక్షుడు, సురాంతకుడు, నరాంతకుడు, దుర్ముఖుడు, ప్రహస్తుడు, మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు విల్లంబులు, కొరడాలు, గదలు, ఖడ్గాలు, శూలాలు, గుదియలు, గొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, రోకళ్ళు మున్నగు ఆయుధాలు పట్టి ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు ఎక్కి వచ్చి యుద్ధం చేసారు. సుగ్రీవుడు, ఆంజనేయుడు, పనసుడు, గజుడు, గవయుడు, గంధమాదనుడు, నీలుడు, అంగదుడు, కుముదుడు, జాంబవంతుడు మున్నగు వీరులు; ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధాలలో చెట్లు, కొండలు పిడికిటిపోట్లుతో కొట్టి సంహరించారు. అంతట.
9-292-క.
ఆ యెడ లక్ష్మణుఁ డుజ్జ్వల
సాయకములఁ ద్రుంచె శైలసమకాయు సురా
జేయుననర్గళమాయో
పాయున్నయగుణ విధేయు నయ్యతికాయున్.
భావము:
ఆ సమయంలో పర్వతసమ దేహుడు, దేవతలకు సైతం అజేయుడు, మాయోపాయుడు, నయగుణ విధేయుడూ అయిన అతికాయుడిని లక్ష్మణుడు ఉజ్జ్వలమైన బాణాలతో సంహరించాడు.
9-293-ఆ.
రామచంద్రవిభుఁడు రణమున ఖండించె
మేటికడిమి నీలమేఘవర్ణు
బాహుశక్తిపూర్ణుఁ బటుసింహనాదసం
కుచిత దిగిభకర్ణుఁ గుంభకర్ణు.
భావము:
కుంభకర్ణుడు నల్లరంగు రాక్షసుడు, మహా పరాక్రమశాలి. అతను గట్టిగా బొబ్బ పెడితే దిగ్గజాల చెవులు దిమ్మెరపోతాయి. అంతటి కుంభకర్ణుడిని శ్రీరాముడు యుద్ధంలో సంహరించాడు.
9-294-క.
అలవున లక్ష్మణుఁ డాజి
స్థలిఁగూల్చెన్ మేఘనాదుఁ జటులాహ్లాదున్
బలభేదిజయవినోదున్
బలజనితసుపర్వసుభటభావవిషాదున్.
భావము:
నవ్వుకూడా భయంకరంగా ఉండేవాడు, అవలీలగా ఇంద్రుడిని జయించే వాడిని, తన భుజబలంతో దేవతా సైనికుల మనసులు కలత పెట్టువాడు అయిన మేఘనాథుడిని రణరంగంలో లక్ష్మణుడు కష్టపడి కూలగొట్టాడు.
9-295-వ.
అంత.
భావము:
అప్పుడు....
9-296-క.
తనవా రందఱు మ్రగ్గిన
ననిమిషపతివైరి పుష్పకారూఢుండై
యనికి నడచి రామునితో
ఘనరౌద్రముతోడ నంపకయ్యము చేసెన్.
భావము:
తనవైపు ముఖ్య వీరులంతా మరణించగా, రావణుడు పుష్పకవిమానం ఎక్కి యుద్ధానికి వెళ్ళి శ్రీరామునితో గొప్ప పౌరుషంతో యుద్ధం చేసాడు.
9-297-వ.
అ య్యవసరంబున.
భావము:
ఆ సమయంలో....
9-298-క.
సురపతిపంపున మాతలి
గురుతరమగు దివ్యరథముఁ గొనివచ్చిన, నా
ధరణీవల్లభుఁ డెక్కెను
ఖరకరుఁ డుదయాద్రి నెక్కు కైవడి దోఁపన్.
భావము:
ఇంద్రుడు పంపగా ఇంద్రసారథి మాతలి బహు భవ్యమైన రథాన్ని తీసుకు వచ్చాడు. శ్రీరాముడు ఆ రథం ఎక్కాడు. అలా రాముడు ఎక్కుతుంటే, సూర్యుడు తూర్పుకొండ ఎక్కుతున్నట్లు అనిపించింది.
9-299-వ.
ఇట్లు దివ్యరథారూఢుండయి రామచంద్రుండు రావణున కిట్లనియె.
భావము:
ఈ విధంగా దివ్యరథం ఎక్కిన శ్రీరాముడు రావణునితో ఇలా అన్నాడు.
9-300-మ.
"చపలత్వంబున డాఁగి హేమమృగమున్ సంప్రీతిఁ బుత్తెంచుటో
కపటబ్రాహ్మణమూర్తివై యబల నా కాంతారమధ్యంబునం
దపలాపించుటయో మదీయశితదివ్యామోఘబాణాగ్ని సం
తపనం బేగతి నోర్చువాఁడవు? దురంతంబెంతయున్ రావణా!
భావము:
“నాతో యుద్ధం చేయడమంటే చపలత్వంతో చాటునుంచి బంగారులేడిని పంపడం కాదు; బ్రాహ్మణుడిలా దొంగవేషంవేసుకొని ఆడమనిషిని అడవిలో దబాయించడం కాదు. ఓ రావణా! తిరుగులేని, వ్యర్థం కాడం అన్నది లేని నా వాడి బాణాగ్ని తాపం ఎలా ఓర్చుకోగలవో కదా.
9-301-క.
నీ చేసిన పాపములకు
నీచాత్మక! యముఁడు వలదు నేఁడిట నా నా
రాచముల ద్రుంచి వైచెద
ఖేచర భూచరులు గూడి క్రీడం జూడన్."
భావము:
ఓ నీచ రావణా! నీవు చేసిన దోషాలకు యమధర్మరాజు అక్కరలేదు. ఖేచర భూచరులు అందరూ చూస్తుండగా ఇవాళ ఇక్కడే నా బాణాలతో నిన్ను సంహరిస్తాను."
9-302-వ.
అని పలికి.
భావము:
అని పలికి....
9-303-మ.
బలువింటన్ గుణటంకృతంబు నిగుడన్ బ్రహ్మాండ భీమంబుగా
బ్రళయోగ్రానలసన్నిభం బగు మహాబాణంబు సంధించి రా
జలలాముండగు రాముఁడేసె ఖరభాషాశ్రావణున్ దేవతా
బలవిద్రావణు వైరిదారజనగర్భస్రావణున్ రావణున్.
భావము:
ఆ రాజలలాముడైన శ్రీరాముడు గొప్పదైన ధనుష్టంకారాలు చెలరేగగా, పరుషంగా మాట్లాడే వాడు, దేవతల సైన్యాన్ని పారదోలే వాడిని, శత్రురాజుల భార్యల గర్భస్రావకారణుడు అయిన రావణుని తన ప్రళయాగ్నిసమ భీకరమైన తన బాణాలు ప్రయోగించాడు.
9-304-క.
దశరథసూనుండేసిన
విశిఖము హృదయంబుఁదూఱ వివశుం డగుచున్
దశకంధరుండు గూలెను
దశవదనంబులను రక్తధారలు దొరఁగన్.
భావము:
శ్రీరాముడు వేసిన బాణం హృదయయాన్ని దూసుకుపోగా రావణుడు పది నోళ్లనుండి రక్తం కారుతుండగా నేలకూలాడు.
9-305-వ.
అంతనా రావణుండు దెగుట విని.
భావము:
అంతట ఆ రావణుడు మరణించడం విని....
9-306-సీ.
కొప్పులు బిగి వీడి కుసుమమాలికలతో;
నంసభాగంబుల నావరింప
సేసముత్యంబులు చెదరఁ గర్ణిక లూడఁ;
గంఠహారంబులు గ్రందుకొనఁగ
వదనపంకజములు వాడి వాతెఱ లెండఁ;
గన్నీళ్ళవఱద లంగములు దడుప
సన్నపు నడుములు జవ్వాడఁ బాలిండ్ల;
బరువులు నడుములఁ బ్రబ్బికొనఁగ
భావము:-
9-306.1-ఆ.
నెత్తి మోఁదికొనుచు నెఱిఁ బయ్యెదలు జాఱ
నట్టు నిట్టుఁ దప్పటడుగు లిడుచు
నసురసతులు వచ్చి రట భూతభేతాళ
సదనమునకు ఘోరకదనమునకు.
భావము:
భూతభేతాళాలు తిరుగుతున్న ఆ భీకర యుద్ధభూమికి తప్పటడుగులు వేస్తూ రాక్షస స్త్రీలు వచ్చారు. వారి జుట్టుముళ్ళు వదులైపోయాయి, పూలహారాల మూపులపై పరచుకొన్నాయి, పాపటముత్యాలు చెదిరిపోయాయి, కర్ణాభరణాలు ఊడిపోయాయి, మెడలో హారాలు చిక్కుపడిపోయాయి, మోములు వాడిపోయాయి, పెదవులు ఎండిపోయాయి, కన్నీళ్ళు వరదలు కట్టాయి, స్తనాల బరువుకు సన్నటి నడుములు జవజవలాడాయి, పైటలు జారిపోయాయి. వారు తలబాదుకొంటూ దుఃఖిస్తున్నారు.
9-307-వ.
ఇట్లు వచ్చి తమతమ నాథులం గని, శోకించి; రందు మండోదరి రావణుం జూచి యిట్లనియె.
భావము:
ఇలా వచ్చిన ఆ రాక్షస కాంతలు వారివారి భర్తలను చూసి దుఃఖించారు, వారిలో మండోదరి రావణుని చూసి ఈ విధంగా పలికింది.
9-308-ఉ.
హా!దనుజేంద్ర! హా! సురగణాంతక! హా! హృదయేశ! నిర్జరేం
ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్త్రునికోలల కోర్వలేక సో
న్మాదముగన్ రఘుప్రవరుమానిని నేటికిఁ దెచ్చి? తప్పుడేఁ
గాదని చెప్పినన్ వినక కాలవశంబునఁ బొంది తక్కటా.
భావము:
“అయ్యో! ఓ రాక్షసరాజా! అయ్యో! హృదయేశ్వరా! దేవతల పాలిటి మృత్యుదేవతవు నీవు. దేవేంద్రాదులను జయించావు కాని మన్మథుని పూలబాణాలకు ఓర్వలేకపోయావు. చపలత్వంతో రాముడి భార్యను ఎందుకు తీసుకొచ్చావయ్యా? అయ్యయ్యో! వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండ మరణం పాలయ్యావు కదయ్యా.
9-309-ఆ.
ఎండఁ గాయ వెఱచు నినుడు వెన్నెలఁ గాయ
వెఱచు విధుఁడు గాలి వీవ వెఱచు
లంకమీఁద; నిట్టి లంకాపురికి మాకు
నధిప! విధవభావ మడరె నేఁడు.
భావము:
నాథా! ఇప్పటి వరకూ లంక మీద సూర్యుడు గట్టిగా ఎండ కాయానికి; చంద్రుడు వెన్నెల కురిపించడానికి; వాయువు గట్టిగా వీచడానికీ జంకేవారు. అటువంటిది నేడు మాకు ఈ లంకానగరానికి వైధవ్యం కలిగింది కదే.
9-310-క.
దురితముఁ దలపరు గానరు
జరుగుదు రెట కైన నిమిష సౌఖ్యంబుల కై
పరవనితాసక్తులకును
బరధనరక్తులకు నిహముఁ బరముం గలదే?
భావము:
పరభార్యాపేక్షా పరులు, పరధనాపేక్షా పరులు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళు పాపం అని భావించరు. మంచిచెడ్డలు చూడరు. అలాంటి వారికి ఇహపరాలు ఉండవు కదే.”
9-311-వ.
అని విలపింప నంత విభీషణుండు రామచంద్రుని పంపుపడసి, రావణునకు దహనాది క్రియలు గావించె; నంత రాఘవేంద్రుండు నశోకవనంబున కేఁగి, శింశుపాతరు సమీపంబు నందు.
భావము:
అని రావణాసురుని భార్య మండోదరి శోకిస్తోంది. అంతట విభీషణుడు శ్రీరాముని అనుజ్ఞ పొంది రావణునికి అంత్యక్రియలు చేసాడు. అప్పుడు శ్రీరాముడు అశోకవనానికి వెళ్ళి అశోకచెట్టు దగ్గరకి వెళ్ళి.....
9-312-శా.
దైతేయప్రమదా పరీత నతిభీతన్గ్రంథి బంధాలక
వ్రాతన్నిశ్శ్వసనానిలాశ్రుకణ జీవంజీవదారామ భూ
జాతన్శుష్కకపోల కీలిత కరాబ్జాతం బ్రభూతం గృశీ
భూతంబ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁ డా ముందటన్.
భావము:
అక్కడ సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టి ఉన్నారు. ఆమె మిక్కిలి భయపడుతూ ఉంది. ఆమె జుట్టు చిక్కులు పడి అట్టలు కట్టింది. నిట్టూర్పులు నిగడిస్తూ, కన్నీరు కారుస్తూ, చిక్కిపోయిన చెక్కిళ్ళపై చేయి చేర్చి, కృశించిపోయి, ప్రాణావశిష్ట అయి ఉంది. అట్టి సీతాదేవిని శ్రీరాముడు చూసాడు.
9-313-వ.
కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుంట వహ్నిముఖంబునం బ్రకటంబుజేసి, దేవతల పంపున దేవిం జేకొని.
భావము:
చూసి, శ్రీరాముడుకూడ బాధ పడ్డాడు. భార్య వలన తప్పేమీ లేదని తెలిసినా, ఆ విషయాన్ని, ఆమె మహత్వం అగ్నిముఖంగా వెల్లడి చేసాడు, దేవతల అనుజ్ఞ ప్రకారము భార్యను స్వీకరించాడు.
9-314-ఉ.
శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా
శేషవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం
తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా
భాషణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్.
భావము:
రాక్షసులను నాశనం చేసిన శ్రీరామచంద్రుడు పాప రహితుడు, అర్థులను తృప్తిపరచువాడు, మృదుభాషి, మితభాషి, శాంతస్వభావి, పెద్దలను గౌరవించువాడు, దయాగుణశాలి అయిన విభీషణుని రాక్షసరాజ్యానికి పట్టంకట్టాడు. అంతులేని వైభవంతో కల్పాంతంవరకు చక్కగా జీవించు అని అనుగ్రహించాడు.
9-315-వ.
ఇట్లు విభీషణసంస్థాపనుండయి రామచంద్రుఁడు సీతాలక్ష్మణ సమేతుండయి సుగ్రీవ హనుమదాదులం గూడికొని, పుష్పకారూఢుం డయి, వేల్పులు గురియు పువ్వులసోనలం దడియుచుఁ దొల్లి వచ్చిన తెరువుజాడలు సీతకు నెఱిఁగించుచు, మరలి నందిగ్రామంబునకు వచ్చెను; అయ్యవసరంబున.
భావము:
ఈ విధంగా శ్రీరాముడు విభీషణుని లంకా రాజ్యంలో ప్రతిష్ఠించాడు. పిమ్మట, శ్రీరాముడు సీతాలక్ష్మణ, సుగ్రీవ, హనుమంతాదుల సమేతంగా పుష్పకవిమానం ఎక్కాడు. దేవతలు పూల జల్లులు కురిపిస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన దారి, గుర్తులు సీతకి చూపుతూ తిరిగి నందిగ్రామానికి వచ్చాడు. ఆ సమయానికి...